ఎలక్టోరల్ బాండ్లపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఉభయసభల్లో కాంగ్రెస్ ఎంపీలు, ఎలక్టోరల్ బాండ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎలక్టోరల్ బాండ్లతో అవినీతిని కప్పిపుచ్చుతున్నారని మనీష్ తివారీ ఘాటుగా విమర్శించారు. ఆర్బీఐ హెచ్చరికలను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్దంగా ఎలక్టోరల్ బాండ్లు సేకరించారని ఎంపీ శశిథరూర్ ఆరోపించారు.
రాజ్యసభలోనూ ఎలక్టోర్ బాండ్లపై దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీఎంవో కార్యాలయమే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్కు పచ్చజెండా ఊపిందని కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. తప్పులు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. విపక్షాలకు ప్రశ్నలకు సర్కారు నుంచి సమాధానాలు ఉండడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది.