తెలుగు యువకుడికి ఈజిప్టు కోర్టు మరణశిక్ష

Update: 2019-11-22 09:40 GMT

దేశం కాని దేశం ఉపాధి కోసం వెళ్లిన ఓ తెలుగు యువకుడికి.. డ్రగ్స్‌ కేసు ప్రాణాల మీదకు తెచ్చింది. శ్రీకాకుళం రూరల్‌ మండలం చంద్రయ్యపేటకు చెందిన బగ్గు రమణ అనే యువకుడు ఈజిప్టులో సీమెన్‌గా పనిచేస్తున్నాడు. 2016, డిసెంబర్‌ 18న అతడు పనిచేస్తున్న షిప్‌లో మాదకద్రవ్యాలు దొరకడంతో అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఈజిప్టు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. అయితే అప్పటి నుంచి రమణ ఆచూకి తెలియరాలేదు. విశాఖకు చెందిన ఏజెంట్‌ను సంప్రదించినా సరైన సమాధానం రాలేదు. దీంతో బాధితులు ఎంపీ రామ్మోహన్‌నాయుడు ద్వారా విదేశాంగశాఖ మంత్రిని కలిశారు. ఈజిప్టు ప్రభుత్వంతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని కోరారు. రమణను క్షేమంగా భారత్‌కు తీసుకురావాలని వేడుకున్నారు.

Similar News