ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పామూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ఏసీ బస్సు అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. కనిగిరికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని లింగారెడ్డిపల్లి వద్ద ప్రమాదవశాత్తు బస్సు టైరు పేలి మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులు వెంటనే బస్సు దిగిపోవడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఘోర ప్రమాదం జరిగి ఉండేది. అప్పటి వరకు సాపీగా సాగుతున్న ప్రయాణంలో కొన్ని నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.