వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యతో తోటి ఉద్యోగులు షాక్కు గురయ్యారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని పశువైద్య, పశు సంవర్ధక శాఖ సంచాలకుల కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగులు ప్రియాంక చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ డా.వి. లక్ష్మారెడ్డితోపాటు అధికారులు, సిబ్బంది మౌనం పాటించారు. ప్రియాంకరెడ్డిని హత్యచేసిన నిందితులను బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
మరోవైపు హైదరాబాద్ లో ప్రియాంక హత్య అత్యంత బాధాకరమని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారిత గురించి మాట్లాడుతున్న మనం రాత్రి 9గంటల సమయంలో కూడా భద్రత కల్పించలేకపోతున్నామన్నారు. దేశవిదేశాల నుంచి హైదరాబాద్ వచ్చి మహిళలు ఐటీ రంగంలో పనిచేస్తున్నారని.. ఇది మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేస్తుందన్నారు. మహిళా కమిషన్ గా తాము ఘటనపై నోటీసులు ఇచ్చామని.. తగిన చర్యలు తీసుకుంటామన్నారు.