రాయలసీమ పర్యటనను ఆపి.. పవన్ ఢిల్లీకి పయనం..

Update: 2019-12-05 08:08 GMT

 

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. షెడ్యూల్ ప్రకారం చిత్తూరు జిల్లాలో శుక్రవారం కూడా పర్యటించాల్సి ఉన్నా దాన్ని కుదించుకుని హస్తినకు ప్రయాణం అవుతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాను కలిసేందుకే ఆయన.. వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ పట్ల పవన్ వైఖరిలో మార్పు రావడం, తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేనంటూ వ్యాఖ్యానించడం నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ నెల మధ్యలో ఓసారి పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అప్పుడు BJP ముఖ్యుల్ని కలిసేందుకే వెళ్లారని వార్తలు వచ్చినా.. అధికారికంగా ఏం జరిగిందన్నది జనసేన వర్గాలు ధృవీకరించలేదు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని పవన్ తిరిగి వచ్చారని చెప్పారు. ఈసారి అమిత్‌షాను కలిసేందుకే వెళ్తున్నట్టు వార్తలు రావడంతో.. రాజకీయంగా ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని పవన్ భావిస్తున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న జనసేనాని.. కొన్ని అంశాలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుత పర్యటన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఉంటుందా, లేదంటే రాజకీయ పరమైన చర్చలకు ఆస్కారం ఇస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది.

Similar News