పౌరసత్వ చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు హోంమంత్రి అమిత్షా. బిల్లును ఆమోదిస్తే ప్రధానంగా మూడు దేశాల్లోని పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్లో వివక్షకు గురై.. అక్కడి నుండి మన దేశానికి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ మూడు దేశాల నుంచి 2014 డిసెంబరు 31వ తేదీలోపు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించరు. సోమవారం చర్చను ముగించి ఓటింగ్ పూర్తి చేసేలా వ్యూహం సిద్దం చేసింది. ఇప్పటికే సభ్యులంతా సభకు తప్పని సరిగా హాజరవ్వాలంటూ బీజేపీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది.
ఈ సందర్భంగా సభలో అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్తో పాటు 11 పార్టీలు వ్యతిరేకించాయి. ఆర్టికల్ 14ను ఇది ఉల్లంఘిస్తోందన్నారు. రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నారు. లోకసభ విపక్షనేత ఆదిర్ రంజన్ భట్టాచార్య. ఇది పూర్తి చట్టవిరుద్దమైన బిల్లు అన్నారు. మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని.. ఈ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ బిల్లు సమానత్వహక్కుకు వ్యతిరేకంగా ఉందన్నారు.
అటు.. ఎంఐఎం ఎంపీ ఓవైసీ సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా అమిత్షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పేరును హిట్లర్తోపాటు గుర్తుంచుకుంటారన్నారు. ఇలాంటి బిల్లు నుంచి దేశాన్ని, హోంమంత్రిని రక్షించాలని స్పీకర్ను కోరుతున్నానన్నారు.
విపక్షాల విమర్శలపై స్పందించిన అమిత్షా.. ఈ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధం కాదన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయరాదని చెప్పారు.