బీజేపీ తీరుతో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆ పార్టీ నిర్వహించిన భారత్ బచావో ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు. తన పేరు రాహుల్ సావర్కర్ కాదు.. రాహుల్ గాంధీ అని వ్యాఖ్యానించారు. కేంద్రం తీరుతో కిలో ఉల్లి రెండు వందలకు చేరే పరిస్థితులు వచ్చాయన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా నష్టోపోయామన్నారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ విమర్శించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడూ సిద్ధమేనన్నారు.
దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు బతికే పరిస్థితులు లేవన్నారు. బీజేపీ తప్పుడు విధానాలతో పనిచేస్తోందని ఆరోపించారు. మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోయాయని అన్నారు. బ్యాంకుల్లో ప్రజల సొమ్ముకు రక్షణ లేదని పేర్కొన్నారు. నల్లధనం ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.
దేశ ప్రజలంతా స్పందించాల్సిన అవసరం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఆరు నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థ రెక్కలు విరిచారన్నారు. మోదీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని పేర్కొన్నారు. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.