వైఎస్ఆర్ నేతన్న హస్తం పథకంలో లబ్దిదారుడిగా పేరు లేదని నిరాశచెందిన ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా సోమందేపల్లి గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. చేనేత వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న నర్సింహులు.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ యజమాని వాళ్లు అనాధలైపోయారు.
జగన్ ప్రభుత్వం తెచ్చిన నేతన్న హస్తం పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. కష్టాల ఊబి నుంచి బయటపడేందుకు అంతో, ఇంతో ఆర్థిక సాయం అందుతుందని సంతోషపడ్డాడు. కానీ.. సర్కార్ ప్రకటించిన లబ్దిదారుల జాబితాలో నర్సింహులు పేరు లేదు. దీంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్టు కుటుంబసభ్యులు చెప్తున్నారు. అర్హులకు కాకుండా అనర్హులకు ప్రభుత్వం లబ్ది చేకూరుస్తోందని రెండు రోజులుగా చెప్తుండే వాడని స్థానికులు అంటున్నారు.