భార్య, బిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు

Update: 2020-01-02 07:52 GMT

అనుమానం పెనుభూతమైంది. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. కుటుంబాన్ని చిద్రం చేసింది. కట్టుకున్న భార్యను, కన్న కూతురిపై పెట్రోల్‌ పోసి నిప్పటించేలా భర్తను ఊసికొల్పింది. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ అమానుష ఘటన.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలో చోటు చేసుకుంది.

అయ్యవారిపల్లెం గ్రామానికి చెందిన జయన్న.. వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్నాడు. భార్య వరలక్ష్మీ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. కూతురు గాయత్రి కొల్లాపూర్‌ పట్టణంలో ఇంటర్‌ సెంకడ్‌ ఇయర్‌ చదువుతోంది. గత కొన్ని రోజులుగా భర్త జయన్న.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో రాత్రి ఇంట్లో భార్యా, కూతురిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు భర్త. అనంతరం తాను పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు కూతురు గాయత్రి ప్రాణాలు విడిచింది. భార్య ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనలో భర్త జయన్న కూడా మృతి చెందాడు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News