రాజధాని కోసం రైతుల పోరాటం ఉధృతంగా సాగుతోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్ని రూపాల్లో ఆందోళనలు తెలియజేస్తున్నారు. మరోవైపు రైతులకు సంఘీభావంగా గుంటూరులో మహిళలు భారీ ర్యాలీ చేశారు. దాదాపు ఐదు వేల మంది మహిళలు.. గార్డెన్స్ నుంచి మదర్ థెరిసా బొమ్మ సెంటర్ మీదుగా.. లాడ్జ్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు.
ఈ ర్యాలీలో చిన్నపిల్లలను ఎత్తుకుని మహిళలు..ఆందోళనకు దిగారు. మూడు రాజధానులు వద్దు అమరావతి రాజధాని ముద్దు అంటూ నినాదాలతో గుంటూరు మారుమోగింది.
అంతకు ముందు.. జాతీయ రహదారి దిగ్బంధానికి రైతులు, అమరావతి జేఏసీ నేతలు, టీడీపీ నేతలు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైవేను దిగ్బంధించేందుకు రైతులు, టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సేవ్ అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై రైతులు తిరగబడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు వారిని అరెస్టు చేసి హాయ్ల్యాండ్కు తరలించారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.