అమరావతి మహిళలపై వాసిరెడ్డి పద్మ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న మహిళలు

Update: 2020-01-08 11:58 GMT

అమరావతిలో విపక్షాలు మహిళలను ముందుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాయంటూ.. మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను ముందుకు నెడుతున్న నాయకులు.. స్వయంగా ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆడవారిని పావులుగా వాడుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలపై రాజధాని మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎవరి చేతిలో పావులం కాదని.. తమ జీవితాలు చిన్నాభిన్నమవుతాయన్న ఆవేదనతోనే రోడ్డెక్కుతున్నామని చెబుతున్నారు. ఒకరు ఆడితే ఆడడానికి తామేమీ బొమ్మలం కాదంటూ తేల్చిచెబుతున్నారు.

మరోవైపు టీడీపీ నేత దివ్యవాణి సైతం వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. రాజధాని ఉద్యమాన్ని ఇంకా వైసీపీ నేతలు ఇంకా రాజకీయ కోణంలోనే చూడడం వారి వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. మహిళలను ఉద్యమంలో వాడుకుంటున్నారంటూ వారిని కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దన్నారు. మహిళలను పావులుగా వాడుకునే సంస్కృతి తమది కాదని.. వైసీపీదే అని దివ్యవాణి ఆరోపించారు.

Similar News