టీడీపీ అధినేత చంద్రబాబు, జేఏసీ నేతల అక్రమ అరెస్ట్పై ఆపార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. జిల్లాల్లో నిరసనకు దిగారు. తిరుపతి గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చంద్రబాబు అరెస్ట్ నీచమైన చర్య అని మండిపడ్డారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను , నేతలను అరెస్ట్ చేశారు.
అటు కుప్పం లో టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్ట్ను ఖండించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. శాంతి యుతంగా రైతుల కోసం పోరాటం చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే విదంగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అటు అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి పట్టణంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, జేఏసీ నాయకులు ధర్నాకు దిగారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నందిగామలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు అరెస్ట్పై మండిపడ్డారు. రోడ్డుపై బెఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ నేతను ఆరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.