పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు బందరు లడ్డూల్లా కనిపిస్తున్నాయా?: కమ్యూనిస్ట్ పార్టీలు
బీజేపీ, జనసేన పొత్తుపై కమ్యూనిస్ట్ పార్టీలు మండిపడుతున్నాయి. గతంలో పాచిపోయిన లడ్డూలు.. నడ్డాను కలిసిన తరువాత బందరు లడ్డూల్లా కనిపించాయా అని పవన్ను ప్రశ్నించారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. ఢిల్లీ వెళ్లిన నేతలు అంతా జె.ఎన్.యుకు వెళ్తే.. పవన్ బీజేపీ ఆశీస్సుల కోసం వెళ్లారని విమర్శించారు. చేగువేరా ఆదర్శమన్న పవన్ ఇప్పుడు చెంగు వీరాగా మారారన్నారు. బీజేపీతో పవన్ ఎందుకు కలుస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతారని.. మరి పవన్కు దమ్ము ఉందో లేదో చెప్పాలని రామకృష్ణ ప్రశ్నించారు.
మరోవైపు.. తనకు కమ్యూనిస్టు భావజాలం ఉందని చెప్పుకొనే పవన్.. మతతత్వ పార్టీ అయిన బీజేపీలోకి ఎలా వెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. వామపక్షాలకు తాను బాకీ లేనని చెబుతున్న పవన్.. ప్రజాస్వామ్యానికి మాత్రం బాకీ పడ్డారన్నారు. ప్రత్యేక హోదా మీద బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్.. అదే పార్టీతో కలిసి ఎలా నడుస్తారని ప్రశ్నించారు. గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందన్న పవన్కు ఇప్పుడు తిరుపతి లడ్డులు కనిపించాయా అని నారాయణ ప్రశ్నించారు.