గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఎంపీని రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పిన పోలీసులు.. తెల్లవారుజామున 3 గంటలకు మంగళగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. గల్లా జయదేవ్కు రిమాండ్ విధించడంతో గుంటూరు సబ్ జైలుకు తరలించారు.
సోమవారం చలో అసెంబ్లీకి బయల్దేరిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముప్పుతిప్పలు పెట్టారు. గుంటూరు జిల్లాలోని అమరావతి, నల్లపాడు, కారంపూడి, నరసరావుపేట, నకిరేకల్ సహా అనేక పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పారు. అంతటితో ఆగకుండా ఆయనపై పలు కేసులు కూడా నమోదు చేశారు. గల్లా జయదేవ్ను నరసరావుపేట నుంచి దుగ్గిరాల వైపు తీసుకెళ్తుండగా గుంటూరు బైపాస్లో మానససరోవరం వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలను అడ్డుకొని గల్లా జయదేవ్ను వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.