అటు టీడీఎల్పీ సమావేశంలో మండలి రద్దు అంశంపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. జగన్ దూకుడుకు బ్రేకులు పడటం ఖాయమని టీడీపీ నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. కేంద్రం సహకరిస్తేనే మండలి రద్దుకు మూడేళ్లు పడుతుందని.. కేంద్రం సహకరించకుంటే శాసన మండలిని రద్దు చేయడం జగన్ వల్ల అయ్యే పని కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసనసభలో బిల్లులు ఆమోదించుకున్నంత సులభం కాదని టీడీపీ నేతలు అంటున్నారు. పార్లమెంటులో వెయ్యికిపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని.. జగన్ ఏదో చెప్పారని కేంద్రంలో చేసే పరిస్థితి లేదని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని.. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు ముందుకు మండలి రద్దు బిల్లు వెళ్తుందని తాము అనుకోవడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.