కేసీఆర్‌కు భయపడి కేసీ కెనాల్‌ కు నీరు వదల్లేదు : మాజీ మంత్రి అఖిలప్రియ

Update: 2020-02-01 09:58 GMT

చంద్రబాబు పాలనలో కేసీ కెనాల్‌ ద్వారా 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తుచేశారు అఖిలప్రియ. కాని జగన్మోహన్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌కు భయపడి శ్రీశైలంలో 871 అడుగుల నీట మట్టం ఉన్నా నీరు వదల్లేదన్నారు. దీనివల్ల సాగు భూములకు నీటి కొరత ఏర్పడి పంట దెబ్బ తినే స్థితి ఏర్పడిందన్నారు. గుండ్రేలకు చంద్రబాబు హయాంలో 3వేల కోట్లతో సాంక్షన్‌ ఇస్తే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా క్యాన్సిల్‌ చేసిందన్నారు. ప్రస్తుతం రాయలసీమ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే వచ్చే వేసవి కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.

ఇప్పటి వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు... జగన్‌ పుణ్యమా అని తాగు నీరు దొరకక సీమ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటారేమో అని ఎద్దేవా చేస్తున్నారు సీమ వాసులు. రాయలసీమ ప్రాజెక్టుల పూర్తిగా దాదాపు 26 వేల కోట్లు అవసరం అవుతాయని ముఖ్యమంత్రి జలవనరుల సమీక్షలో నిర్ధారించారు. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం, గత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పనులను కక్షపూరితంగా ఆపేయడం జగన్‌ను రాయలసీమ ద్రోహిగా నిలబెడుతోంది. సీమలో ఉన్న రిజర్వాయర్లు అన్ని కూడా నింపడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. జగన్‌ మోహన్‌ రెడ్డి దౌర్జన్యానికి కియా అనుబంధ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాయని అఖిల ప్రియ ఆరోపించారు. గత ప్రభుత్వం ఓర్వకల్లు విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం కనీసం విమానాలు నడపలేకపోయిందన్నారు. తమ ప్రభుత్వం సౌర, పవన, విద్యుత్‌ ప్లాంటులు నిర్మించి 13వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే... ఈ ప్రభుత్వం ఈ పరిశ్రమల విద్యుత్‌ ప్యానళ్లు ద్వంసం చేసిందని ఆరోపించారు. ఈ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరలించడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. తమ పరిధిలో లేని హైకోర్టు తరలింపును కర్నూలుకు ఇస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలుకు రాజధాని ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నారు. ఉంటే రాజధాని అమరావతిలో ఉండాలి. తరలించదలచుకుంటే శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలుకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు అఖిలప్రియ.

Similar News