అమరావతి ఉద్యమంలో రైతుల గుండెలు అలసిపోతున్నాయి. 49 రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురవుతున్న రైతులు తనువు చాలిస్తున్నారు. అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న మరో రైతు గుండెపోటుతో మృతచెందడం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద వడ్లపూడిలో ఈడ్పుగంటి బుల్లబ్బాయి అనే రైతు గుండెపోటుతో మృతిచెందాడు. ల్యాండ్ పూలింగ్లో భాగంగా రాజధాని కోసం అర ఎకరం పొలాన్ని ప్రభుత్వానికి ఇచ్చాడు. జగన్ సర్కార్ రాజధానిని తరలించే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో 49 రోజులుగా అక్కడి వారితో కలిసి ఆందోళనల్లో పాల్గొంటున్నాడు. సోమవారం కూడా ఆందోళనల్లో పాల్గొని ఇంటకి వెళ్లిన బుల్లబ్బాయి ఒక్కసారిగా ఉండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయాడు. రాజధాని తరలిస్తున్నారన్న మనస్తాపంతోనే బుల్లబ్బాయి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.