హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణం జరిగింది. రమేష్ అనే చేపల వ్యాపారిని కిడ్నాప్ చేసి చంపేశారు దుండగులు. ఆయన మృతదేహాన్ని ఓ గోనే సంచిలో పెట్టి కల్యాణ్నగర్లో పడేశారు. రమేష్ను ఈ నెల1న కిడ్నాప్ చేశారు దుండగులు. ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయన కోసం గాలించారు.
అయితే.. రెండ్రోజుల క్రితం ఫోన్ చేసిన కిడ్నాపర్లు.. రూ.90 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. చివరికి జూబ్లీ హిల్స్లోని కల్యాణ్ నగర్లో ఆయన మృతదేహం దొరికింది. కిడ్నాప్ చేసిన మరుసటి రోజే అతని చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
రమేష్ ఇటీవలే తనకున్న ఆస్తులను అమ్మి.. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. చేపల వ్యాపారంలో రమేష్ బాగా సంపాదించుకున్నట్లు తెలుసుకున్న వ్యక్తులే అతన్ని కిడ్నాప్ చేసి చంపేశారని భావిస్తున్నారు పోలీసులు.