తమిళనాడులో ఓ మంత్రికి అధికారమదం తలకెక్కింది. తన కాలికి ఉన్న చెప్పులు తీసేందుకు ఓ కుర్రాడిని పిలిచి పని చేయించారు. దిండిగుల్ శ్రీనివాసన్ తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏనుగుల క్యాంప్ ప్రారంభించేందుకు మధుమలై టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్కు వెళ్లారు అటవీ శాఖ మంత్రి శ్రీనివాసన్. అక్కడ ఓ గుడి కనిపించడంతో దర్శనం కోసం అటుగా వెళ్తామనుకున్నారు. తన చెప్పులు తీసేందుకు ఓ పిల్లాడిని పిలిచి పనిచెప్పారు. ఓ మంత్రయి ఉండి కూడా గిరిజన బాలుడితో చెప్పులు తీయించుకోవడం పెద్ద దుమారాన్నే రేపింది. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, నేతలు అంతా బాలుడు చెప్పులు తీస్తున్నా చూస్తూనే ఉన్నారని, ఎవరూ వారించే ప్రయత్నం చేయలేదని విమర్శలు వెల్లువెత్తాయి.
71 ఏళ్ల శ్రీనివాసన్ నడుం నొప్పితో బాధపడుతున్నారని అందుకే అలా చేయాల్సి వచ్చిందని మీడియా దీన్ని పెద్దదిగా చేయడం సరికాదని అనుచరగణం నీతులు బోధిస్తోంది. అటు, మంత్రిగారు కూడా ఇది పెద్ద రచ్చకు దారి తీయడంతో వివరణ ఇచ్చారు. ఆ కుర్రాడు తనకు మనవడి లాంటివాడంటూ ఏదోసర్దిచెప్పి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.