ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వీఐపీలు సైతం ఉదయాన్నే క్యూలైన్లలో నిల్చోని తమ ఓటు వేస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రులు హర్షవర్థన్, జైశంకర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాందీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీజేపీ నేత రాంమాధవ్.. ఇతర రాజకీయ ప్రముఖులు ఓటేశారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియా మాట్లాడారు. ఢిల్లీ బాధ్యతల్ని మీ భుజాలపై మోయాలని ప్రజలను కోరారు. అటు ఆప్ కార్యకర్తపై కాంగ్రెస్ అభ్యర్థి ఆల్కాంబ చేయి చేసుకున్నారు. దీనిపై ఆప్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఢిల్లీలో చలి తీవ్రత తగ్గుతున్నకొద్దీ.. ఓటర్ల బయటకు వస్తున్నారు. పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 13 వేల 767 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. వాటిలో 3 వేల 141 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ పటిష్ట భద్రత చేపట్టారు. 190 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 42 వేల మంది పోలీసులు, 19 వేల మంది హోంగార్డులు పోలింగ్ భద్రతలో పాల్గొంటున్నారు.