రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 151 గంటల దీక్ష కొనసాగిస్తున్న రాజధాని ప్రాంత యువకులు విజయవాడ హెల్ప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువకులతో లోకేష్ మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఓ మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా మూడు ముక్కల రాజధాని విజయవంతం కాలేదన్నారు. అన్నం పెట్టే రైతులు రోడ్డున పడ్డారని.. అమరావతికి మద్దతు తెలిపినందుకు నాగార్జున వర్సిటీ విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేశారని ఫైరయ్యారు. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే పోలీసులు అరెస్టు చేస్తున్నారని.. ఇది ఐదు కోట్ల ఆంధ్రులకు.. మూర్ఖంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి మధ్య జరుగుతున్న యుద్ధమని లోకేష్ అన్నారు.