టీ20 సిరీస్లో క్లీన్ స్వీప్ ఓటమికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంది. వన్డే సీరిస్ లో మూడు మ్యాచ్లూ నెగ్గి విరాట్ టీంను వైట్ వాష్ చేసింది. దీంతో 31 ఏళ్ల తర్వాత బ్రేక్ చేసి చెత్త రికార్డ్ నమోదు చేసింది. మూడుకంటే ఎక్కువ మ్యాచ్ల వన్డే సిరీస్లో టీమ్ఇండియా చివరిసారిగా 1989లో క్లీన్ స్వీప్ అయ్యింది. వెస్టిండీస్ చేతిలో 0-5తో ఓడింది. మళ్లీ ఇప్పుడు 31 ఏళ్ల తర్వాత కోహ్లీ టీం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ప్రత్యర్ధికి సిరీస్ అప్పగించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. బ్యాటింగ్ లైనప్ కెప్టెన్ కోహ్లీతో పాటు టాప్ ఆర్డర్ పెద్దగా రాణించలేకపోయినా..మిడిలార్డర్లో కొత్త జోడీ లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రాణించటంతో ఫైటింగ్ స్కోరును సాదించింది భారత్. లోకేశ్ రాహుల్ మరోసారి సెంచరీతో చెలరేగిపోయాడు. 113 బంతుల్లో 112 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 62 పరుగులు, మనీశ్ పాండే 42 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో బెనెట్ 4 వికెట్లు పడగొట్టాడు.
297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ టీం..47.1 ఓవర్లలో టార్గెట్ ఫినిష్ చేసింది. 5 వికెట్లు కొల్పోయి 300 పరుగులు చేసింది. గప్టిల్, గ్రాండ్ హోమ్ చెలరేగిపోవటంతో న్యూజిలాండ్ కు 296 పరుగుల టార్గెట్ కూడా అలవోకగా మారింది. మార్టిన్ గప్టిల్ 46 బంతుల్లో 66 పరుగులు చేశారు. గ్రాండ్హోమ్ కేవలం 28 బంతుల్లోనే 58 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. హెన్రీ నికోల్స్ 80 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో చాహల్కు మూడు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో కూడా బూమ్రా ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. వన్డే, టీ-ట్వంటీల్లో చెరో క్లీన్ స్వీప్ రికార్డ్ నమోదు చేసుకున్న భారత్-న్యూజిలాండ్ ఇక టెస్ట్ సిరీస్ కు రెడీ అవుతున్నాయి. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది.