ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు కేజ్రీవాల్. ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో 10 గంటలకు జరిగే కార్యక్రమంలో ఆయనతోపాటు ఆరుగురు శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఢిల్లీ వాసులకే పరిమితం చేయాలని భావించిన కేజ్రీవాల్.. ఇతర రాష్ట్రాల CMలు, రాజకీయపార్టీల పెద్దలు ఎవరినీ పిలవలేదు. మీ బిడ్డను ఆశీర్వదించేందుకు రండంటూ ఢిల్లీ వాసుల్ని కోరారు.
'ధన్యవాద్ ఢిల్లీ' అంటూ ఎక్కడికక్కడ పోస్టర్లు ఏర్పాటు చేసిన ఆప్.. కొత్త ప్రభుత్వం తొలి రోజు నుంచే చేయాల్సిన ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. అటు, ఇవాళ వేదికపై ఢిల్లీ నిర్మాణ్లో కీలకమైన వివిధ వర్గాలకు చెందిన 50 మందికి చోటు దక్కింది. రాంలీలా మైదాన్లో జరిగే ఈ ప్రమాణస్వీకారానికి 3 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.