భారతీయుడు -2 సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది. కమల్ హాసన్ హీరోగా.. దర్శకుడు శంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈవీపీ స్టూడియోలో సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దర్శకుడు శంకర్ కూడా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఆయన కాలు ఫ్రాక్చర్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
మృతి చెందినవారిలో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు, సహాయ దర్శకుడు కృష్ణ, కేటరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన చంద్రన్ ఉన్నట్లు తెలిసింది. చెన్నై శివారు పూందమల్లిలోని ఈవీపీ స్టూడియోలో భారతీయుడు–2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ భారీ క్రేన్లతో ప్రత్యేక సెట్టింగ్స్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు.
రాత్రి 9.30 గంటల సమయంలో 150 అడుగులున్న క్రేన్ హఠాత్తుగా కిందకు పడిపోయింది. ఆ సమయంలో సమీపంలోని ఓ టెంటులో దర్శకుడు శంకర్ తన అసిస్టెంట్లతో కలిసి మానిటర్లో రషెస్ చూస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ సమయంలో చిత్రహీరో కమల్హాసన్ సెట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.