ఏపీలో వైసీపీ నేతలు విధ్వసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. 9 నెలల్లో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని ఆరోపించారు. వైసీపీ నేతల బెదిరింపులకు భయపడే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని చెప్పారు. సీఎం జగన్ను ఏం అనాలో కూడా అర్థం కావడం లేదన్నారు. టీడీపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానులన్న ప్రతిపాదన చూసి ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయని అన్నారు చంద్రబాబు.
ప్రజాచైతన్యయాత్రలో భాగంగా చంద్రబాబు చిత్తూరుజిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రామకుప్పం మండలం విజులాపురంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంపై జగన్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు చంద్రబాబు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు ఇవ్వాలంటూ లేఖ రాశానని.. ఇంతవరకు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.