మెల్లిగా తేరుకుంటోన్న ఢిల్లీ

Update: 2020-03-01 14:28 GMT

దేశ రాజధాని ఢిల్లీ మెల్లిగా తేరుకుంటోంది. అల్లరిమూకల ఆగడాల నుంచి దాదాపుగా బయటపడుతోంది. అడుగడుగునా పోలీసుల నిఘా ఉన్నా.. ప్రజల్లో మాత్రం ఇంకా కాస్త భయాందోళనలు తొలగిపోవడం లేదు. మళ్లీ ఏమైనా జరుగుతుందేమో అన్న టెన్షన్ ప్రజలను వెంటాడు తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలను తొలగించడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.. 24 గంటలు పహారా కాస్తున్నారు.. ప్రజలతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెబుతున్నారు. రోజువారీ కార్యకలాపాలు యధావిధిగా చేసుకోవాలని, ఎలాంటి గొడవలు జరగకుండా తాము చూసుకుంటామని భోరసా ఇస్తున్నారు. దుకాణాలు తెరిచి వ్యాపారాలు చేసుకోవాలని, తాము అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు.

ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించారు. ఢిల్లీలోని ఏ ప్రాంతంలోనూ మళ్లీ ఇటువంటి ఘటనలు జరగలేదని తెలిపారు. పలు ప్రాంతాల్లో పాఠశాలలకు ఆందోళనకారులు నిప్పంటించారని వస్తోన్న వార్తలన్నీ అసత్యాలేనని ఆయన చెప్పారు. ఢిల్లీలో మళ్లీ సాధారణ పరిస్థితులు తీసుకురావడమే తమ మొదటి ప్రాధాన్యమని తెలిపారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో బాధిత కుటుంబానికి వెంటనే 25,000 రూపాయలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 167 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అలాగే, 885 మంది అనుమానితులను అరెస్ట్ చేశామని చెప్పారు. కొన్ని కేసులను సాయుధ బలగాల చట్టం కింద నమోదు చేసినట్లు వివరించారు.

అంతా ప్రశాంత నెలకొంటోంది అనుకుంటున్న సమయంలో పోలీసులకు టెన్షన్ తప్పడం లేదు. ఆందోళన కారులను వెంటనే ఖాళీ చేయించాలని.. లేదంటే తాము నిరసనలు చేపట్టాల్సి వస్తుందని హిందూసంఘాలు పిలుపు ఇవ్వడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. షహీనాభాగ్‌లో 144 సెక్షన్‌ విధించారు.

Similar News