కరోనా కట్టడిపై తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన అంశాలపై హైపవర్ కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించారు. మార్చి 31 వరకు విద్యా సంస్థలు బంద్కు నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, సినిమా థీయేటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి శాసనసభ సమావేశాలు యథాతథంగా జరుగుతాయి.
కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అలెర్ట్గా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, వైద్యులకు ఆదేశించింది. అటు టెన్త్, ఇంటర్ పరీక్షలు కొనసాగించే అవకాశం ఉంది. ఈనెల 19 నుంచి టెన్త్ పరీక్షలు మొదలు కానున్నాయి. కరోనా వైరస్ కట్టడిపై మంత్రి వర్గం సమావేశం తర్వాత దీనిపై మరిన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.