కరోనాపై యుద్దం ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆదివారం జనతా కర్ఫ్యూ చేయాలని పిలుపునిచ్చారు. మోదీ పిలుపును అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా ఇంటిపట్టునే ఉండాలన్న మెసేజ్ను చేరవేసేందుకు సీఎంలు, గవర్నరులు, మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు బాధ్యతగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు.
ఆదివారం దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనతా కర్ఫ్యూను తెలంగాణ వ్యాప్తంగావిధిగా ఎవరికి వారు స్వచ్ఛందంగా పాటించాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలంటూ.. సీఎస్ సోమేష్ కుమార్ను ఆదేశించారు సీఎం కేసీఆర్.
ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలని పిలుపునిచ్చారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. కరోనా గురించి ప్రజలెవరూ భయపడొద్దని, అప్రమత్తంగా ఉంటే చాలని చెప్పారు. ఆదివారం రాజ్భవన్లో జనతా కర్ఫ్యూ పాటిస్తామని చెప్పారు.
ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సంఘీభావం పలుకుదామన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. ఆదివారం ప్రజందరూ స్వచ్ఛందంగా జనతా కర్ప్యూను పాటించాలని కోరారు. ఆ రోజు ప్రజలెవరూ బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రయాణాలు, పనులన్నింటిని రద్దు చేసుకోవాలన్నారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొనేందుకు ఏపీ ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. మన కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు గవర్నర్.
ఆదివారం ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి. ఆరోజు రోడ్డుపై ఎలాంటి వాహనాలు రాకూడదన్నారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఇందుకు సహకరించాలన్నారు.
ప్రధాని మాట పాటిద్దాం - కరొనా విముక్త భారత్ను సాధిద్దాం అంటూ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వీడియో ద్వారా ప్రజల్ని కోరారు. ఈ సంక్షోభం యావత్తు మానవాళిని చుట్టుముట్టిందన్న ఆయన.. ఆదివారం దేశమంతటా కర్ఫ్యూ పాటించాలని పిలుపినిచ్చారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూటా ట్విట్టర్లో మోదీ సందేశాన్నిప్రజలకు తెలియజేశారు. మనల్ని రక్షించడానికి కరోనాపై ఫైట్ చేస్తున్న వారందరికీ సెల్యూట్ చెద్దామన్నారు. ప్రధాని చెప్పినట్లు మన బాల్కానీలో నిలబడి దద్దరిల్లిపోయేలా చప్పట్ల సౌండ్తో వారిని గౌరవిద్దామన్నారు.