కరోనాని కట్టడి చేసేందుకు అండగా ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని మోడీకి లేఖ రాసిన రాహుల్ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం మంచి పరిణామమని చెప్పారు. లాక్డౌన్ ప్రభావం రోజువారీ కూలీలపై పడుతోందని లేఖలో ప్రస్తావించారు. లాక్డౌన్తో పట్టణాల్లో ఉన్న యువత గ్రామాల బాటపట్టారని.. దీని వల్ల గ్రామాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులను కాపాడుకుంటూనే.. యువకులను హెచ్చరించాలని సూచించారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఆస్పత్రులు, వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని రాహుల్ కోరారు. కార్మికులు ఇబ్బంది పడకుండా తక్షణ ఆర్థిక సాయం అందించాలని రాహుల్ డిమాండ్ చేశారు.