కరోనా మహమ్మరి సామాన్యులతో పాటు దేశాధినేతలను కూడా వణికిస్తోంది. ఇప్పటికే ఇరాన్, బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రులకూ.. కెనడా ప్రధానమంత్రి భార్యకు కరోనా వైరస్ సోకింది. వీరితో పాటు స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ భార్య బెగోనా సాంచెజ్కి కూడా కరోనా వైరస్ సోకింది. తాజాగా రిపబ్లిక్ ఆఫ్ కాంగో మాజీ అధ్యక్షుడు కరోనా లక్షణాలతో పారిస్లో మరణించినట్లు తెలుస్తోంది.
రిపబ్లిక్ ఆఫ్ కాంగో మాజీ అధ్యక్షుడు జాక్వెస్ జాక్విన్ యోంబి ఒపాంగో.. కరోనా వ్యాధితో మృతిచెందినట్లు సమాచారం. ఆయన వయసు 81 ఏళ్లు. అయితే వైరస్ కన్నా ముందు ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. యోంబి ఒపాంగో 1977 నుంచి 79 వరకు కాంగ్రో-బ్రాజవిల్లీ ఉద్యమాన్ని నడిపించారు. ఆయన అనేక సంవత్సాలు జైలు జీవితం గడిపారు. 1991లో పార్టీని స్థాపించి ప్రధాని అయ్యారు. 1993 నుంచి 1997 వరకు ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఫ్రాన్స్కు వెళ్లిపోయారు. 1997 నుంచి 2007 వరకు పదేళ్ల పాటు దేశం విడిచి వెళ్లారు.