ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిల్లాడిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కలిపి ఇప్పటి వరకు 8 లక్షల 58 వేల 669 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 42 వేల 151 కు చేరింది. అయితే ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు ఐక్య రాజ్య సమితికీ పాకింది. జెనీవాలోని 9 మంది యూఎన్ కార్యాలయ సిబ్బందికి కరోనా సోకినట్టు ఐక్యరాజ్య సమితి సమాచార డైరెక్టర్ అలెసాండ్రా వెలుసి వెల్లడించారు. అయితే ప్రస్తుత సమయంలో బాధితులకు సంబంధించిన వివరాలేవీ చెప్పబోమని ఆమె స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. స్థానిక స్విట్జర్లాండ్ ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి కోవిడ్-19 పై పోరుకు పనిచేస్తామని పేర్కొన్నారు.