మా నాన్న లాక్డౌన్ పాటించటం లేదు.. తండ్రిపై కుమారుడు పోలీస్లకు ఫిర్యాదు
కరోనాపై పోరాటానికి దేశం మొత్తం స్వీయ నిర్బంధంలో ఉంది. అయితే.. పలు చోట్ల ప్రజలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తున్నారు. దీంతో అధికారులు, వారి చుట్టు పక్కల వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పాటించటంలేదని.. ఢిల్లీలో ఓ వ్యక్తి .. తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ప్రతి రోజు రాత్రి 8 గంటలకు బయటకు వెళ్తున్నాడని.. ఎన్ని సార్లు చెప్పినా వినడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బయటకు వెళ్లిన అతని తండ్రిని ఇంట్లోకి వెళ్లమని చెప్పారు. అయితే ఆయన పోలీసుల మాట వినకపోవడంతో.. తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.