కరోనా వైరస్కు జన్మస్థానమైన వూహాన్ నగరంలో 76 రోజుల పాటు విధించిన లాక్డౌన్ను ఎత్తివేశారు. దీంతో దాదాపు రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితమైన నగర ప్రజలకు ఒక్కసారిగా స్వేచ్ఛ లభించినట్లైంది. రోడ్లన్నీ సందడిగా మారాయి. దుకాణాలు తెరుచుకున్నాయి. కోవిడ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాకపోవడంతో లాక్డౌన్ ఎత్తివేశారు. దీంతో వివిధ ప్రాంతాలకు ప్రజల రాకపోకలు మొదలయ్యాయి. దాదాపు 55 వేల మంది రైళ్ల ద్వారా వూహాన్ నగరం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసే వీలుందని స్థానిక మీడియా తెలిపింది. ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లలో రద్దీ వాతావరణం కనిపిస్తోంది. అయితే పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. వాటిపై ఆంక్షలు అమలవుతూనే ఉన్నాయి.