రిలయన్స్ ఇండస్ట్రీస్కు అనుబంధ సంస్థగా ఉన్న జియో ప్లాట్ఫామ్స్లో ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ భారీ పెట్టుబడులు పెట్టింది. మైనారిటీ ఇన్వెస్ట్మెంట్లో ఇండియాలో ఇదే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కావడం విశేషం.
ఫేస్బుక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ల మధ్య అతిపెద్ద ఒప్పందం కుదిరింది. జియో ప్లాట్ఫామ్లో 9.99 శాతం వాటా కోసం ఫేస్బుక్ 43 వేల 574 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ఒప్పందంతో జియోలో ఫేస్బుక్ అతిపెద్ద వాటాదారుగా మారింది. తాజా ఇన్వెస్ట్మెంట్తో జియో ప్లాట్ఫామ్స్ విలువ 4.62 లక్షల కోట్లకు పెరిగింది. మైనారిటీ పెట్టుబడుల పరంగా దేశంలో ఇదే అతిపెద్ద ఎఫ్డిఐ కావడం విశేషం. భారతదేశంపై ఫేస్బుక్కు ఉన్న నమ్మకాన్నిఈ భారీ పెట్టుబడి ప్రతిబింబిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
కోవిడ్-19 తర్వాత డిజిటలైజేషన్ ఆవశ్యకత మరింత పెరుగుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అంచనా వేస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ల మధ్య వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం అనేక ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. అదే సమయంలో వ్యాపార విస్తరణ కూడా జరగనుంది. వ్యక్తులు, వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడం కోసం రిలయన్స్, ఫేస్బుక్ సంస్థల భాగస్వామ్యం ఉపయోగపడనుందని ఇరు సంస్థలు భావిస్తున్నాయి.