భారత ప్రజల స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. కరోనాపై దేశ ప్రజలంతా యుద్ధం చేస్తున్నారని..ప్రజలే పోరుకు నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. మనం చేస్తున్న యుద్దాన్నీ ప్రపంచం మొత్తం గమనిస్తుందని.. దేశ ప్రజలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ లాక్డౌన్ పాటిస్తున్నారని.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.
ఈద్ వచ్చేలోగా కరోనాను ఖతం చేద్దామని ముస్లింలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. గత ఏడాది వరకూ రంజాన్ పండుగను వేడుకగా జరుపుకున్నా.. ఈ సారి మాత్రం కరోనా మహమ్మారి కారణంగా ఉత్సాహంగా జరుపుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ స్థలాల్లో ఉమ్మివేయడమనే చెడ్డ అలవాటును శాశ్వతంగా మానుకోవాలని మోదీ సూచించారు. పరిసరాల శుభ్రతతోపాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ స్థలాల్లో ఉమ్మివేసే అలవాట్లు మానుకోవాలని ప్రధాని సూచించారు.