తన పదునైన మాటలతో ఐక్యరాజ్యసమితిలో భారత కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేశారు భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్. గురువారం ఆయన రిటైర్ అయ్యారు. ఐరాసాలో పాక్.. భారత్పై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రతి సారి పాక్ చర్యలను ఖండిస్తూ కడిగిపారేసేవారు. ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెన్ సర్వీస్) 1985 బ్యాచ్కు చెందిన అక్బరుద్దీన్ 2016 జనవరి నుంచి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన వీడ్కోలు సందర్భాన్ని పురస్కరించుకుని.. కరోనాను కట్టడి చేసే నిమిత్తం ఓ మంచి సూచనను అందించేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే ఐరాసా ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్కు నమస్కరించి విధుల నుంచి తప్పుకున్నారు. నమస్కరించేందుకు సమయం ఆసన్నమైంది అంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడ్కోలు పలుకుతూ గుటెరన్కు నమస్కరిస్తున్న వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి గుటెరన్ కూడా చిరునవ్వుతో నమస్తే అని అక్బరుద్దీన్కు బదులిచ్చారు.