కరోనా వైరస్కి వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి వచ్చేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నారని.. ఒకవేళ అమెరికా కంటే ముందుగా వారు వ్యాక్సిన్ తీసుకొస్తే మంచిదే అని అభిప్రాయపడ్డారు. ఎవరు చేశారు అన్నదానికంటే ఎంత త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడగలమనేదే ముఖ్యమని ఆయన అన్నారు.
వ్యాక్సిన్ తయారీ చివరి దశకు వచ్చినా ఇంకా మనుషులపై ప్రయోగించాల్సి ఉందని అన్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ ట్రయల్స్లో సహకరిస్తున్నారని అన్నారు. అయితే వారు ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నామనేది తెలుసుకుని పూర్తి అవగాహనతోనే వస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో నిపుణుల సూచనలు, సలహాలు పాటించకుండా ప్రకటనలు చేస్తున్నారని అధ్యక్షుడు ట్రంప్పై ఒక అపవాదు ఉంది.
అయితే దానికి ట్రంప్ సమాధానమిస్తూ.. ఈ అంశంపై వైద్యులు తనని మాట్లాడొద్దంటున్నారు కానీ నాకు ఏది తోస్తే అది మాట్లాడతా.. అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కాగా, వ్యాక్సిన్ తయారీ కోసం వివిధ దేశాల్లోని ప్రముఖ బయో ఫార్మీసీ కంపెనీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. వారి కృషి ఫలించి త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వీలవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.