దాదాపు 40 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్డౌన్కు కొన్ని సడలింపులను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ సడలింపులు వచ్చి 24 గంటలు కూడా గడవకముందే కేంద్ర ప్రభుత్వం సడలింపులు విషయంలో మెలిక పెట్టింది. కొత్త కేసులు వేగంగా ప్రబలితే మాత్రం మరోసారి లాక్డౌన్ తప్పదని స్పష్టం చేసింది. సోమవారం ఒక్కరోజే 2553 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని, 72 మంది మరణించారని పేర్కొంది.
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,000 దాటగా, కోవిడ్ రికవరీ రేటు 27 శాతానికి పెరగడం కొద్దిగా ఉపశమనం కలిగించింది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశంలో అన్నారు. మరోవైపు రెడ్జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి సడలింపులూ ఉండవని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు వలస కార్మికులను తరలించడానికి రైల్వే ఛార్జీలను 85% ఖర్చును కేంద్రం భరిస్తుందని మిగిలిన 15% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా రెడ్ జోన్లలో రిక్షాలు, ఆటోలు, ట్యాక్సీలు నిషేధమని, మాల్స్, సెలూన్లు, స్కూళ్లు, రెస్టారెంట్లు, స్పాలను అనుమతించమని తెలిపారు. అయితే చిరు వ్యాపారులు.. ఒకరు మాత్రమే నిర్వహించే దుకాణాలను తెరుచుకోవచ్చని చెప్పారు.