ఏపీ ఈసీ రమేష్కుమార్ తొలగింపుపై హైకోర్టు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం ఉందన్న ఏజీ.. ప్రభుత్వ నిర్ణయాలను చట్టవిరుద్దంగా చూడలేమన్నారు. కక్ష సాధింపులో భాగంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చారన్న పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదన్నారు అడ్వకేట్ జనరల్. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని ఎన్నికల కమిషనర్ నియమించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయినట్లు తెలిపారు. ఎన్నికల సంస్కరణలో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు అడ్వకేట్ జనరల్. ఏజీ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారి పదవి కాలాన్ని తగ్గించిన సందర్భాలు ఏమైనా ఉంటే కోర్టు ముందుంచాలంది. విచారణ సమయం ముగియడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.