రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈనెల 15 తరువాత రాష్ట్రంలో పరిస్థితులను బట్టి బస్సులు ఎప్పుడు నడపాలనే నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకుంటారని అన్నారు. లాక్డౌన్ అనంతరం కరోనా నేపథ్యంలో ఇకపై బస్సులు ఎలా నడపాలి.. సీట్లు ఏ విధంగా ఉండాలి.. ప్రయాణీకులను ఏ విధంగా బస్సులలో ఎక్కించాలి అనే దానిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు.
గతంలో మాదిరిగా ఇకపై ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉండదని అన్నారు. ఒకే సీట్లో ముగ్గురు లేదా నలుగురు కూర్చోవడం, నిలబడి ప్రయాణించడం కుదరదని అన్నారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ.. లాక్డౌన్ కారణంగా మరింత సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అయినా సిబ్బందికి సగం వేతనం ఇచ్చామన్నారు. పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. కేంద్ర రవాణా శాఖ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలన్నారు.