కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ప్రతిపక్షాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నాయి. కరోనా వైరస్ కట్టడికి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, కార్మిక చట్టాల్లో కొన్ని రాష్ట్రాలు చేస్తున్న మార్పులపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీపై ప్రధానంగా దృష్టి సారించే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విపక్షాల వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ సమావేశానికి 18 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. మార్చిలో కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలని అన్ని పార్టీలు నిర్ణయించినప్పటికీ.. ఈమధ్య ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో.. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపైనా కాంగ్రెస్ దృష్టి పెడుతోంది.