ప్రతి ప్రయాణికుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లేదంటే టిక్కెట్ ఇవ్వొద్దని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి బస్సుల వివరాలు, ప్రయాణీకులకు అందిస్తున్న సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి డిపోలో కండక్టర్కు శానిటైజర్ ఇవ్వాలని చెప్పారు. ప్రయాణీకులు కూడా శానిటైజ్ చేసుకున్నాకే టికెట్ తీసుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని బస్సులకు విధిగా శానిటైజర్ అందించాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.