చెన్నైలోని 23 టీటీడీ స్థిరాస్తులను వేలం వేయకుండా నిరోధించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, ఎస్టేట్ అధికారులను.. పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. గత ఫిబ్రవరి 29న పాలకమండలి ఆమోదించిన తీర్మానం మేరకు ఏప్రిల్ 30న విడుదల చేసిన వేలం ప్రకటన చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ అమర్నాథ్ పిల్లో పేర్కొన్నారు. ఈ వేలాన్ని నిరోధించడంతో పాటు టీటీడీకి చెందిన అన్ని ఆస్తులను కాపాడేందుకు జుడీషియల్ కమిటీని నియమించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వై. బాలాజీ కోర్టును అభ్యర్థించారు. టీటీడీకి చెందిన సకల స్థిర, చరాస్తుల వివరాలు నోటిఫై చేసి పూర్తిగా సంరక్షించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు.