బంగారాన్ని ఇష్ట దైవంగా భావించే గోల్డెన్ బాబా ఇకలేరు. తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ నివాసి సుధీర్ కుమార్ మక్కర్ అలియాస్ గోల్డెన్ బాబా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఎయిమ్స్లో చికిత్స పొందుతూ.. కన్నుమూశారు. బాబా స్వస్థలం ఘజియాబాద్.
ఢిల్లీలో వస్త్ర వ్యాపారం చేసే సుధీర్ కుమార్ మక్కర్.. సన్యాసం తీసుకున్న తరువాత గోల్డెన్ బాబాగా మారారు. తరువాత గాంధీనగర్లో గోల్డెన్ బాబా ఆశ్రమం ఏర్పాటు చేశారు. బాబా 1972 నుంచి భారీగా బంగారం ధరించడం ప్రారంభించారు. బాబాకు రక్షణగా నిత్యం 30 మంది బాడీగార్డులు కాపలాగా ఉంటారు. బాబాపై కిడ్నాప్, దోపిడీ, దాడి, హత్యాబెదిరింపు తదితర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.