ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో దేశీయ కంపెనీ రిలయన్స్ జియో లో మాత్రం పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది. భారతీయ కార్పొరేట్ చరిత్రలో ఇప్పటిదాకా ఏ కంపెనీ సమీకరించని భారీ మొత్తాన్ని కేవలం 11 వారాల్లో రిలయన్స్ జియో సాధించింది. ఏప్రిల్ 22, 2020 నుండి ఇప్పటివరకు రూ 1,17,588 కోట్లను సమీకరించిన జియో, గత 11 వారాల్లో ఫేసుబుక్ , కేకేఆర్లతో పాటు తాజాగా ఇంటెల్ క్యాపిటల్ పెట్టుబడులతో ఇప్పటివరకు 12 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించింది.
రిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్లో 0.39 శాతం వాటా కోసం రూ. 1,894 కోట్లు ఇంటెల్ ఇన్వెస్ట్ చేయనుంది. రూ. 4.91 లక్షల కోట్ల ఎంటర్ప్రైజ్ విలువ వద్ద జియోలో 0.39 శాతం వాటా ఇంటెల్ క్యాపిటల్ తీసుకుంది.2021 మార్చి నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని కంపెనీ ఇప్పటికే సాధించటం గమనార్హం.