ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాకిస్థాన్లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని తరిమికొట్టే చర్యల్లో భాగంగా వైద్యులు పోరాటం చేస్తున్నారు. అక్కడ డాక్టర్లకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ.. 48 మంది డాక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు డాక్టర్ల రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
పాక్లో ఇప్పటి వరకు 2,28,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు 4,700 మంది మృతి చెందారు. మొత్తం ఐదు వేల మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకింది. ఇందులో 3 వేల మంది డాక్టర్లు, 600 మంది నర్సులు ఉన్నారు. ఇక కరోనా కారణంగా ఇప్పటి వరకు 47 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ ప్రావిన్స్ లో అత్యధికంగా 35 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు.