జపాన్లో భారీగా వానలు కురుస్తున్నాయి. దేశంలో వరదల బీభత్సానికి పలువురు గల్లంతయ్యారు. కుమామోటోలో 44 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు తోడు బలమైన గాలులు వీస్తుండటంతో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. దీంతో పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు జపాన్ అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది.
ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలైన ఫ్యుకోకా, నాగసాకి, సాగాలకు జపాన్ వాతావరణ విభాగం ప్రమాద హెచ్చరికలు జారీచేసింది. దీంతో అధికారులు ఆయా ఏరియాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కుమామోటో, మియాజాకి, కగోషిమా ప్రాంతాల నుంచి 2,54,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.