జమ్ముకశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. ఉగ్రవాదుల దాడిలో బీజేపీ నేత షేక్ వాసిం మృతి చెందాడు. అతనితో పాటు ఆయన తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ బషీర్ కూడా మరణించారు. బందిపోర్లో తమ దుకాణంలో షేక్ వాసిం తన తండ్రి , సోదరుడు కూర్చొని ఉండగా వారిపై బుధవారం రాత్రి ఉగ్రవాదులు దాడిచేశారు. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో వారు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే వారిని జిల్లా హాస్పిటల్కి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. ముగ్గురిని తలపై కాల్చారని డాక్టర్లు తెలిపారు.
కాగా, షేక్ వాసింకు 8 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. అయితే ఉగ్రదాడి సమయంలో ఒక్కరూ లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందిని అరెస్ట్ చేసి.. విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను పీఎం మోదీ ఖండించారు. వాసిం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.