Woman's Body : యూనివర్సిటీలోని వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం

నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో..

Update: 2024-05-07 05:15 GMT

నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలోని వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం లభ్యంకావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్‌లో ఓ మహిళ మృతదేహాం కనిపించింది. దీనితో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

తక్షణం  పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని వెలికితీసారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారి శివహరి మీనా మాట్లాడుతూ.. ఆ మహిళ తన అత్త, భర్తతో కలిసి క్వార్టర్స్ భవనంలోనే నివసిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. అలానే ఆమె భర్త యూనివర్సిటీ సమీపంలోని జిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్నట్టు పేర్కొన్నారు.

 భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపినట్టు వెల్లడించారు. ఇక ఎప్పటిలానే ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. కాగా ఆ గొడవే మహిళ హత్యకు దారి తీసిందని, ఈ నేపథ్యంలో అత్త, భర్త ఇద్దరు కలిసి ఆమెను హత్య చేసి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్షకు తరలించినట్లు పేర్కొన్నారు.

 మహిళ మృతిపై ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ధర్యప్తు చేపట్టినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపిన ఆయన.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వాస్తవాలను బయటపెడతామని చెప్పారు.

Tags:    

Similar News