బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకీ అప్పగించాలని కోరింది. సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కలిసి.. తమ కుమారుడికి సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించి దర్యాప్తు త్వరగా జరిగేలా చూడాలని కోరారు. దీంతో బీహార్ సీఎం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా.. సుశాంత్ సింగ్ ముంబైలో తన ఇంట్లో జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని మృతి చెంది సుమారు నెలన్నర అవుతున్నా.. ఆయన మరణం ఇంకా మిస్టరీగానే ఉంది. ప్రతీ రోజు ఆయన మరణంపై పలు కథనాలు మీడియాలో వినిపిస్తున్నాయి. ముంబై పోలీసులు సుశాంత్ కేసులలో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో.. బీహార్ పోలీసులు పాట్నాలో కేసు నమోదు చేసి విచరణ జరుపుతున్నారు. బీహార్ పోలీసుల ముంబైలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి 15 కోట్ల డబ్బును ఎవరు విత్డ్రా చేశారన్న కోణంలో విచారణ జరుగుతున్నది. సుశాంత్ ను తన గర్ల్ఫ్రెండ్ రియా హత్య చేసిందని సుశాంత్ తండ్రి ఆరోపిస్తున్నారు. అయితే, ముంబై పోలీసులు మాత్రం సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. బైపోలార్ డిజార్డర్ అనే మానసిక సమస్యలతో సుశాంత్ బాధపడినట్లు ముంబై పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్ తెలిపారు.